Tuesday, March 25, 2014

శ్రీనాథుని భీమఖండ పద్యం

చంద్రబింబాననచంద్రరేఖామౌళి నీలకుంతలభారనీలగళుఁడు 
ధవళాయతేక్షణధవళాఖిలాంగుండు మదనసంజీవనిమదనహరుఁడు
నాగేంద్రనిభయాననాగకుండలధారి భువనమోహనగాత్ర భువనకర్త
గిరిరాజకన్యకగిరిరాజనిలయుండు సర్వాంగసుందరిసర్వగురుఁడు

గౌరిశ్రీ విశ్వనాథుండు కనకరత్న 
పాదుకలు మెట్టిచట్టలు పట్టుకొనుచు 
నందికేశుండు ముందట నడచిరాఁగ 
నరుగుదెంచుట యద్భుతమయ్యె మాకు.
. పై సీసపద్యములోనినాలుగు పాదాల్లోనూ పార్వతినిపరమేశ్వరుణ్ణి ప్రతి పాదములో ప్రస్తుతించాడు శ్రీనాథుడు!
  • గౌరీదేవి చంద్రబింబము వంటి ముఖసౌందర్యము కలిగివున్నది. (ఆననము అంటే ముఖము).మరిశంకరుడేమో చంద్రరేఖను (నెలవంకను) తలపై ధరించివున్నాడు.
  • ఆమె నల్లని దట్టమైన కురులను కలిగివుంది. అతడు నల్లని కంఠం కలవాడు. (సంస్కృతములో నీల' అనే పదానికి నలుపు ' అనే అర్థం వుంది.) క్షీరసాగరమధన సమయములో బయల్వెడలిన హాలాహలాన్ని లోకరక్షణార్థమై పరమేశుడు స్వీకరించి తన కంఠాన నిలిపిన గాథ సుప్రసిద్ధం కదా!
  • ఆమె తెల్లని విశాలమైన కన్నులు కలిగివుంది. అతడు తెల్లని శరీరకాంతితో ప్రకాశిస్తున్నాడు.
  • మరణించిన మన్మథుణ్ణి సైతం తిరిగి బ్రతికింపజేయగల సౌందర్యం ఆ తల్లిది. ఆయనేమో తన ఫాలాగ్నిలో మదనుణ్ణి భస్మం చేసినవాడు.
  • ఆమె ఏనుగు నడక వంటి మందగమనం కలిగివుంది. (నాగము ' అంటే ఏనుగు అనే అర్థం వుంది.)స్త్రీలను గజగమనలు ' అని వర్ణించడం కవులకు పరిపాటే! మరిశివుడేమో నాగాభరణుడు. సర్పములనే అలంకారములుగా ధరించినవాడు.
  • సర్వలోకాలనూ సమ్మోహితం చేయగలిగిన సురుచిర శరీర సౌందర్యం సర్వమంగళది. ఆయనేమో సాక్షాత్తూ విశ్వనాథుడే! సర్వలోకాలకూ కర్త.
  • ఆమె గిరిజ. అనగా గిరులకే రాజైన హిమవంతుని ముద్దులపట్టి. ఇక ఆయన కైలాస పర్వతమునే తన నివాసంగా చేసుకున్నవాడు.
  • అన్ని అవయవములు పొందికగా అమరిన సర్వాంగసుందరి ఆమె. ఆయన సర్వులకూ గురువు;జగద్గురువు.
        పైవిధంగా ఆ ఆదిదంపతులుతమ వాహనమైన నందీశ్వరుడు ముందు నడవగా అద్భుతమైన రీతిలో సాక్షాత్కరించారు.

        మహాదేవుని అర్ధనారీశ్వరతత్వం ప్రతిఫలించేలాశ్రీనాథ కవీంద్రుడు వారిద్దరినీ ఒకేవిధమైన విశేషణాలు వినియోగిస్తూ విలక్షణరీతిలో వర్ణించిన ఈ పద్యప్రసూనం సహృదయరంజకం. 

No comments: